🪷ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్..
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు
(విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది.
క్రీ.శ. 10, 11వశతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండ ను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవారు. ఆయన, ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్ధనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు.
అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరధుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు.
దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి, శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం. వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం ఉత్తర నక్షత్రం, కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది.
వారిలో ఒకరు ఆడ పిల్ల, మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజు కి కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది. భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను, తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.
విష్ణు వర్ధనుడు విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు. విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది.
తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు.
విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది.
ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది. కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు.
దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు..
ఆత్మ బలిదానం వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 101 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు.నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్పూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు. ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి *’ఆర్యమహాదేవి’* యొక్క అవతరాన్ని అని చెప్పింది.
ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా 🔥అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.
విష్ణువర్ధనుడి మరణం ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని.
అగ్ని గుండంలో దూకారు.
విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విన హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు.
వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.
శ్రీ వాసవి దేవి వారసత్వం ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు.
ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు- “సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది. ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు.
*పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 102 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్టించాడు*. నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరిని *వైశ్య కుల దేవతగా* తలచి పూజలు చేయడం మొదలెట్టారు.
వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది.
*వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది*. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది…
_*కొన్ని ముఖ్య విషయాలు🌾*_
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కేవలం ఆర్యవైశ్య కులస్తులకు మాత్రమే కులదేవత అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
*వాసవాంబిక శ్రీపాద శ్రీ వల్లభుల సహోదరి*.
శ్రీపాద వల్లభ మరియు దత్త భక్తులందరూ కులగోత్రాలకతీతంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిని దర్శించి తీరవలసిందే. వాసవాంబిక ఆత్మార్పణ జరిగిన తరువాత పెనుగొండను అనేక మంది క్షత్రియ రాజులు పరిపాలించారు. వారందరూ వారి రాజకోటను పెనుగొండ ఊరి అవతలే కట్టుకున్నారు. ఏ ఒక్కరాజు పెనుగొండ లోపల ఉండి పాలించడానికి సాహసించలేదు.
వైశ్యులు గోవుకు *‘మఠాల’* ను స్థాపించి
పూజించడం వల్ల వీరిని గోమఠాల వారని అది క్రమేణా కోమట్లు గా మారిందని చరిత్ర చెబుతోంది.
🪷స్వారోచిషమనువు కాలంలో (10వ -11వ శతాబ్దంలో) 18 సామంత రాజ్యాలకు ప్రధాన పట్టణం పెనుగొండ (జ్యేష్టశైలం/బృహత్శిలానగరం)- ఆ *18 నగరాలు:* బృహత్ శిలానగరం,నిరవద్యపురం, వీరనారాయణపురం, విశాలపురం, చిన్నజగన్నాధము, పెద్దజగన్నాధము, చిన్నత్రిగుణపురం, పెద్దత్రిగుణపురం, పిఠాపురం, కళింగపురం, ధర్మపురం , ధనద పురం, నరసపురం, పాంచాల పురం, భీమపురం, ఆసంటము, ఘంటశాలము, పాలకొలను…
*శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి నమోస్తుతే!*
వ్యాఖ్యానించండి