1950, ఏప్రియల్ 14, శ్రీ వికృతి నామ సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణ మహర్షి భౌతిక దేహాన్ని విడిచి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. నేడు చైత్ర బహుళ త్రయోదశి, భగవాన్ రమణులు మహాసమాధి చెందిన రోజు, ఆ సందర్భంగా ఉదయం రమాణాశ్రమంలో భగవాన్ ఆరాధానోత్సవాలు నిర్వహించారు.
మహాసమాధి చెందేనాటికి రమణుల దేహం చాలా బలహీనపడింది. అసలు లేవలేకపోయింది. ఆహారం కూడా స్వీకరించలేదు. రాత్రి 8 గంటలకు, తమని కూర్చోబెట్టమని రమణులు అన్నారు. (కూర్చోబెట్టడమంటే దిండుని ఆనుకుని కూర్చోవడమే. శరీరం సహకరించలేదు). మూతపడి ఉన్న కుడి కన్ను నుంచి చెంపైపైకి ఎందుచేతనో నీళ్ళు ధారగా కారసాగాయి. పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూ ఉన్నారు. భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించటం కష్టంగా ఉంది. ఇంతలో హాలులో కూర్చున్న జనం ‘అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా’ అంటూ పాడసాగారు. ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది. (తన తండ్రి అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళిపోతున్నానే ఆనందం ఏమో!) ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన, ప్రకాశవంతమైన కాంతి పుంజం అద్భుతకాంతులు విరజుమ్ముతూ ఆ చోట (ఆ ఆశ్రమం నుంచే) నుంచి పైకి లేచి, ఈశాన్యం దిశగా అరుణాచాల శిఖరం దిశగా పయనించి వెళ్ళిపోయింది. దీన్ని దేశదేశాల ప్రజలు దర్శించారు. అదే సమయంలో 8-47 నిమిషాలకు (రాత్రి) భగవాన్ దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది. అరుణాచలేశ్వరుడు వెలిగించి జ్ఞానజ్యోతి (భగవాన్ రమణులు) తన సహజ రూపంలో (జ్యోతి రూపంలో) జనులందరూ చూస్తుండగా, వెళ్ళి అరుణాచలేశ్వరునిలో ఐక్యమయ్యారు. అవధూత, అవతారమూర్తి, జీవన్ముత్కుడు, దక్షిణామూర్తి స్వరూపమైన రమణులు భౌతిక దేహాన్ని విసిరివేశారు.
రమణుల మహాసమాధి చిత్రాలను ఫోటో తీసింది హెర్ని కార్టిర్ (1908-2004), ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫోటొగ్రాఫర్, ఆధునిక ఫోటోజనర్లిజం పితామహుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈయన రమణుల మహాసమాధికి ముందు ఏప్రియల్ 1950 లో అరుణాచలం వచ్చారు. ఆయనే ఈ చిత్రాలను తీసు భద్రపరిచారు. ఈ సృష్టిలో ఏదీ కాకతాళీయం ఉండదు. కార్యముంటే కారణముంటుందని వేదాంతం ప్రకటించింది. బహుసా రమణులే ఈ సమయానికి వీరిని ఇలా ఇక్కడకు రప్పించి, మనలాంటి వారిని అనుగ్రహించడానికి ఈ కార్యం జరిపించారేమో!
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలా
వ్యాఖ్యానించండి