ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి విష్ణువు దగ్గరికి వచ్చి “స్వామి! సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏంటి? అంటే దీనికి నేను ఎందుకు సమాధానం చెప్పడం! వెళ్లి అక్కడ ఒక పురుగు ఉంది దానిని అడుగు అన్నాడు.
నారద మహర్షి పురుగు దగ్గరికి వెళ్లి “సత్సంగం అంటే ఏంటి? దానివలన ఉపయోగం ఏమిటి అని అడిగాడు.
పురుగు నారదమహర్శిని చూసి చనిపోయింది.
వెంటనే భగవంతుడి వద్దకు వచ్చి స్వామి! సత్సంగం గురించి అడిగితే పురుగుని అడగమన్నారు. అడిగితె చనిపోయింది అన్నాడు.
భగవంతుడు నవ్వి ఇప్పుడు ఆ పావురాన్ని అడగమన్నాడు.
నారదుడు వెళ్లి పావురాన్ని అడిగాడు.
పావురం కూడా మహర్షిని చూసి చనిపోయింది.
మహర్షికి ప్రేమ పుట్టి అయ్యో ఏంటి సత్సంగం గురించి అడిగితె ఇలా చనిపోతున్నాయి అని మళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్లి చెబుతాడు.
అదిగో ఇప్పుడే పుట్టిన లేగదూడ ని అడుగు సత్సంగం గురించి అంటాడు.
వెళ్లి లేగదూడతో “సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి అనగానే మహర్షి వైపు చూసి చనిపోతుంది.
అప్పుడు నారదుడు భయపడి “ఇక సత్సంగం గురించి అడగను. అడిగితె చనిపోతున్నారు” అని నిర్ణయించుకుంటాడు.
మళ్లీ ఒక్కసారి భగవంతుడిని అడుగుదామని భగవంతుడి దగ్గరికి ధైర్యంగా వెళతాడు. వెళ్లి అడుగుతాడు.
అయితే ఆ భగవంతుడు మాత్రం.. చివరిసారిగా రాజ్యంలో అప్పుడే పుట్టిన యువరాజు ఉన్నాడు…వెళ్లి అడుగు అంటాడు.
అప్పుడు నారదుడు భయపడుతూ “ఇంతవరకు పురుగుని అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదూడని అడిగాను కానీ అవన్నీ చనిపోయాయి. ఈ సారి ఈ పిల్లాడిని అడిగితె వీడికి ఏమౌతుందో! అని భయపడుతూ పిల్లాడి దగ్గరకు వెళ్లి నెమ్మదిగా చెవిలో అడిగాడు “సంత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏమిటి? అని.
పిల్లాడు నారదుడిని చూసి నవ్వుతూ! నారదా! నేను ఎవరో గుర్తుపట్టలేదా?
నేనే ఆ పురుగుని, ఆ పావురాన్ని, ఆ లేగదూడని.. మీరు వచ్చి నాతో మాట్లాడడం వలన పురుగుగా ఉన్న నేను పావురాన్ని అయ్యాను. పావురంగా ఉన్న నేను లేగదూడగా పుట్టాను. మళ్లీ వచ్చి మాట్లాడడం వలన 84 లక్షల జీవరాసులలో కెల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మ పొందాను. మనిద్దరి మధ్య ఉన్న సత్సాంగత్యం వలన అపురూపమైన మానవ జన్మను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం.
దీనిని బట్టి మీరందరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందఱో మహాపురుషుల సత్సంగం వలన మనకి మానవజన్మ ప్రాప్తించింది. దీనిని సార్ధకం చేసుకోవాలి తప్ప పాడు చేసుకోవద్దు.
వ్యాఖ్యానించండి