గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. “ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి?
పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?”
“మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ” అని చెప్పాడు సూతుడు.
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.
*ఓం గం గణపతయే నమః*
*మట్టి గణపతి ఎందుకంటే..*
రాతి వినాయకుని పూజిస్తే జ్ఞానం,
రాగి వినాయకుని పూజిస్తే ఐశ్వర్యం,
వెండి విగ్రహంగా ఉన్న గణేశుని పూజిస్తే ఆయుష్షు, బంగారు వినాయకుని పూజిస్తే సంకల్పసిద్ధి లభిస్తాయట.
కానీ మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తే సర్వమూ లభిస్తాయని గణేశ పురాణం చెబుతోంది. స్థిరమైన జ్ఞానానికి చిహ్నం రాయి.
తేలికగా మార్పిడి చేసుకునే ధనానికి చిహ్నం రాగి (మన నాణేలన్నీ ఒకప్పుడు రాగిలోనే ఉండేవి కదా!).
ఇక వెండిలో ఔషధి గుణాలున్నాయన్నది ఆయుర్వేదం చెబుతోంది.
ఆశకు చిహ్నం బంగారం…
అందుకనే ఆయా పదార్థాలతో గణపతిని పూజించేవారిలో, వాటిని అనుగుణమైన కోరికలు తీరుతాయని దీని భావం కావచ్చు.
కానీ మట్టి వీటన్నింటికంటే విశిష్టమైనది.
జీవ నిర్జీవ రాశులన్నింటికీ ఈ పుడమి తల్లే ఆధారం. ఆ ప్రకృతికి ప్రతిరూపమైన మట్టికి తను కొలుచుకునే దేవుని రూపాన్ని ఇస్తాడు మనిషి.
ఆ రూపాన్ని భక్తితో కొలిచి, ఘనంగా సేవించి, ధూపదీప నైవేద్యాలను అర్పించి తిరిగి ప్రకృతిలోనే కలిపేస్తాడు. అందుకనే ప్రకృతితో మమేకమవుతూ సాగే గణేశుని పూజలో మట్టి వినాయకుడు ఉండటం సహేతుకం.🚩🙏🏻
వ్యాఖ్యానించండి