ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ధర్మ సందేహాలు – కామద ఏకాదశి ?

చైత్ర శుద్ధ ఏకాదశి దీనినే సౌమ్య ఏకాదశి , కామద ఏకాదశి , దమన ఏకాదశి అని కూడా అంటారు.
ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణుపూజ , ఉపవాసం , జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడిందని చెబుతారు…

పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి ముఖ్యంగా స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది…
స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు.
పూజా మందిరమే అయినా … దేవాలయమే అయినా వాళ్లు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు.
తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు…

అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు, అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామద ఏకాదశి వ్రతం’ కనిపిస్తుంది.

ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది.
ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి.. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి.. లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.

ఉపవాసం.. జాగరణ అనే నియమ నిబంధలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది…
చాలామంది ఉపవాసం అంటే , కడుపును చంపుకోవడం అనుకొంటారు, ( ఉప + వాసం = ఉపవాసం, ఉప అంటే దగ్గర, వాసం అంటే నివసించడం, అనగా భగవంతుడికి దగ్గరగా, అంటే భగ్వన్నామ స్మరణ లో ఉండాలని అర్థం ) ఒకవేళ కడుపు మాడ్చుకొంటే దాని అర్థం :- నీవు పూర్వజన్మలో ఏ ఒక్కరికీ దానం ధర్మం చేయకుండా వున్నావు కాబట్టి ఆ స్థితి భగవంతుడు నీకు ఇప్పుడిస్తున్నాడు అని అర్థం

కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతోంది.
ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు.

ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.

ఓ గంధర్వుడు శాపం కారణంగా తన భార్యకు దూరమై , రాక్షసుడి రూపంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.
తన భర్తను ఆ స్థితి నుంచి బయటపడేయడం కోసం ఆ గంధర్వ స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది.
వ్రత ఫలితం వలన ఆ గంధర్వుడుకి శాప విమోచనం కలిగి తన భార్యను చేరుకుంటాడు.
భార్యా భర్తలు ఎలాంటి పరిస్థితుల్లోను విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉంది. అందుకే చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు పెద్ద సంఖ్యలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుతూ ఉంటారు.
ఈరోజునే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి.
కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊచితే , వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి , కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంత్యమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

🌹శుభమస్తు🌹
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి