ధర్మ సందేహాలు తెలుగు [Dharma Sandhehalu Telugu]

ఈరోజు మనం – ఎన్నో పూజలు, భజనలు, సాధనలు, చేస్తుంటాము, అయినా సాధనలో ముందుకు వెళ్లలేకపోతాము, దీనికి కారణం ఏమిటి?

ప్రతివారి మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచన…

దానికి సంబంధించిన – మహాభారతం లోని ఒక చిన్న సంఘటన చూద్దాం…
అభిమానమే బంధన
ఒకానొక సమయంలో రాధ తన చెలికత్తెలను తీసుకొని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్లాలని సంకల్పంతో…
తెల్లవారక మునుపే లేచారు, గుంపంతా పడవలో కూర్చున్నారు.
వంతుల ప్రకారం ఒకరి తరువాత మరొకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతూ ఉన్నారు…

చాలాసేపు చేసారు ఈ డ్రైవింగ్!
చేతులంతా నొప్పి వచ్చాయి, తెల్లవారింది, కాని, పడవ మధుర రేవులోనే ఉంది!
తెల్లవారింది కాబట్టి మధుర వాళ్ళంతా వచ్చి నీళ్ళు ముంచుకొని పోతున్నారు…

అది చూసి … ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం? అని చూసుకుంటే,
ఆ పడవ ఒక కఱ్ఱకు కట్టివేయబడి ఉంది,
ఆ కఱ్ఱకు కట్టిన త్రాడును వీళ్ళు విప్పలేదు పాపం!
అది విప్పకుండా ఎంతసేపు తెడ్లు వేసినా పడవ ముందుకు కదులుతుందా? ఉన్న చోటే ఉంటుంది.

అదేవిధంగా, మనం ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానమును చేరలేము…
ముందు అహంకార మమకారములనే త్రాడును విప్పాలి, త్యాగం చేయాలి, అన్నివిధాలా బంధవిముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమనస్సు ఆవిర్భవిస్తుంది.
పూర్ణమనస్సునందు ఎలాంటి దోషములూ కనిపించవు,
ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే – ఎవరో దీనికి కారకులు కాదు; మన భావములే కారణం.

మన దోషములే మనకు కష్టాల నందిస్తాయి, ఈ సత్యాన్ని గుర్తించాలి, సత్యము, ప్రేమ, సహనము ఇత్యాది సద్భావములను హృదయంలో నింపుకున్నప్పుడు జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది కాని, దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన “వైతరణీనది” గా ప్రవహిస్తుంది…

కనుక, ఎవరికి వారు గుర్తించుకోవచ్చు, “నేను సుందరమైన నందన వనమునా? లేక, వైతరణీ నదినా?” అని.

దీనిని పరులెవ్వరికీ గుర్తించడానికి వీలుకాదు, ఎవరిది వారికి మాత్రమే తెలుసు.
ఎవరికి వారే సాక్షి, ఇంకొకరి సాక్ష్యం అక్కరలేదు. దీనినే “ఆత్మసాక్షి” అన్నారు. నీవు తప్పు చేసే ఒప్పు చేసినట్లుగా అభినయం చేయవచ్చు.

మన అభినయం లోకానికి మంచిగా కనిపించవచ్చుకాని, లోపల దోషం మనలను ఎల్లప్పుడు హింసిస్తుంది.

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

వ్యాఖ్యానించండి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి