ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోమాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్రవీగుతుంటాము, …
కానీ అవి ఎంతవరకు మనలను – భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము,
అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటుచేసుకుంది …
అదేమిటో ఒకసారి పరిశీలిద్దాం…
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.
తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.
కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు, చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు…
ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.
‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు…
అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు…
‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు)…
ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి,
వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు…
తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి.
ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది,
నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది.
వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు…
ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు…
కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు.??
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి
‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు.
అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.
మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికి తెలియదు, అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురుసిపోవడం వద్దు, అహంకార మమకారాలకు దూరంగా ఉండి, అంత భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి…
అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి.
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
వ్యాఖ్యానించండి